అది కాశి విశ్వనాధుని దేవాలయమైన, మన ఇంటి దగ్గరిలోని గుడి ఐనా పరమేశ్వరుడిని ఏ దేవాలయంలో చూసినా కాని లింగ రూపంలోనే దర్శనమిస్తున్నారు.. మానవ ఆకారంలో ప్రతిమరూపంలో దర్శనమివ్వడం అనేది చాలా తక్కువ దేవాలయాలలో మాత్రమే జరుగుతుంది. అలా విగ్రహరూపంలో దర్శనమిచ్చే అతి తక్కువ దేవాలయాలలో ఈ సిద్దేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. పరమేశ్వరుని ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. లింగరూపంలో దర్శనమివ్వడానికి ఏ కారణం ఐతే ఉంటుందో విగ్రహ రూపంలో దర్శనమివ్వడానికి కూడా ఒక బలమైన కారణం ఉంటుంది.
ఈ గుడి అనంతపురం జిల్లా నుండి 150కిలోమీటర్లకు దూరంగా ఉన్న అమరాపురం మండలంలోని హేమావతిలో వెలసిల్లుతుంది. ఈ ఆలయం ఎంత మహిమ గలదో అంతే పురాతనమైనది కూడా. పూర్వం నలంబరాజులు 7వ శతాబ్ధంలో హేమావతిని రాజధానిగా చేసి సుమారు 350 సంవత్సరాలు తమ రాజ్యాన్ని పాలించారని చెబుతారు. వారి కాలంలోనే ఈ ఆలయాన్ని స్థాపించారని ఆ తర్వాత వచ్చిన పల్లవ రాజులు మొదలైనవారు అభివృద్ధి చేశారని స్థానికుల కథనం.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఆలయ గోడలు, గోపురం మీద చెక్కిన శిల్పాల గురించి.. దేవాలయం అతి పురాతనమైనది కావడంతో నాటి కళాకారుల శిల్పాబిరుచి వీటిలో మనకు తెలుస్తుంది. ఈ గుడి ఇరుకుగా కాకుండా చాలా విశాలంగా సుమారు 12 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ దేవాలయంలోనే కాలబైరేశ్వర, పంచలింగేశ్వర, మల్లేశ్వర స్వామి, విరుపాక్షేశ్వర స్వామి మొదలైన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఆరు అడుగుల శివ లింగం కూడా ప్రత్యేక శక్తివంతగా, ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అన్ని రకాల పూజలు జరుగుతాయి. దేవాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రితో పాటు, పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి.