మన కళ్ళముందే ఊహించలేని అభివృద్ధి జరిగిపోతుంది.. వీధి కి ఒక్క ల్యాన్డ్ లైన్ ఫోన్ ఉండే రోజులను చూశాం, ఒక్కొక్కరు రెండు మూడు ఫోన్ లను Maintain చేసే రోజులను చూస్తున్నాం, టీవీ చూడడానికి పక్కింటికి వెళ్ళేవాళ్ళం కాస్తా ఈ రోజు పర్సనల్ గా మొబైల్ లో ఫ్రీ గా టీవీ చూస్తున్నాం.. ఈ టెక్నాలజీ అభివృద్ధి లో వ్యవసాయం కూడా భాగమవ్వాలని భువనగిరి జిల్లాకు చెందిన మల్లేష్ గారు రైతు కష్టాన్ని తగ్గించే పరికరాలను తయారుచేస్తున్నారు.

ఆటోమాటిక్ స్టాప్:
బావి ద్వారా పంటలకు నీటిని అందించడం పాత పద్దతి. ఇంతకుముందు చేతితో తోడి పంటను తడిపేవారు.. కరెంట్, మోటార్స్ రావడంతో వారి కష్టం 99% శాతానికి పడిపోయింది. ఇప్పుడు మోటార్స్ వల్ల కొత్త సమస్య వచ్చిపడింది. కరెంట్ రాగానే ఆటోమాటిక్ గా ఆన్ అయ్యే స్టార్టర్లు వాడడం వల్ల మోటార్లు తిరుగుతూనే ఉంటాయి, దీని వల్ల బుష్ లు, బేరింగ్ లు పనిచేయడానికి పనికిరాక మోటార్ల రిపేర్లకు అధిక డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. మల్లేష్ గారు ఆటోమాటిక్ స్థాపర్ తయారుచేశారు దీని మూలంగా నిర్ధేశించిన టైమ్ లో లేదంటే బావిలో నీళ్ళు అయిపోగానే ఆగిపోతుంది. మోటార్లు చెడిపోవడం జరగదు.

యూరియా చల్లుతుంది:
రైతు కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది, ఇదంతా పంట పెట్టుబడులపై భారం పడిపోతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రస్తుతం నాట్లు వేసే యంత్రాన్ని తయారుచేస్తున్నారు(కొన్ని నెలల్లోనే అందుబాటులోకి రాబోతుంది). ప్రస్తుతం యూరియా చల్లె పరికరం అందుబాటులో ఉంది. పంట త్వరగా ఎదగడం కోసం యూరియా చల్లుతారు ఇది సరిగ్గా వేయాల్సి ఉంటుంది లేదంటే కలుపు పెరిగే అవకాశం ఉంటుంది. మల్లేష్ రూపొందించిన ఈ యంత్రం పూర్తిగా సోలార్ పవర్ తో పనిచేస్తుంది. ఈ ఫెర్టిలైజర్ స్ప్రేయర్ లో యూరియా వేసి మెషిన్ ఆన్ చేస్తే కేవలం 15 నిమిషాలలో ఎకరం పొలానికి యూరియా చల్లుతుంది.

కోతులు, అడవి పందులను తరమడానికి:
మొక్క జొన్న తోటలు, వివిధ రకాల పండ్ల తోటలు, పల్లి చేను మొదలైన పంటలకు కోతులు పందుల వల్ల అధిక ముప్పు ఉంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ ఇబ్బందులను చూసి పంటను నాశనం చేసే అడవి పందులను చంపినా పర్వాలేదు అని రైతులకు ఓ సందర్భంలో చెప్పారు. కొంతమంది రైతులైతే పంట చుట్టూ కరెంట్ తీగలను పెట్టి కరెంట్ షాక్ కు కూడా గురిచేసేవారు. మల్లేశం తయారుచేసిన ఈ పరికరం అటు రైతులకు ఇటు పందులకు కోతులకు ఏమంత ఇబ్బంది ఉండదు. పొలంలో ఈ మెషిన్ అమర్చిన తరువాత పంట చుట్టూ తీగ వేస్తారు. ఒకవేళ పందులు కాని కోతులు కాని అటువైపు వస్తే కనుక ఎలక్ట్రానిక్ సెన్సర్లు పెద్ద శబ్ధాలు మోగిస్తాయి. ఈ పెద్ద శబ్ధాలకు భయపడి అవి పంట చుట్టు పక్కలకు అసలే రావు.

ఇవి మాత్రమే కాదు పంటలో కలుపు తీసే మిషన్, పత్తి ఏరే మెషిన్, విత్తనాలను నాటే మెషిన్, రిమోట్ కంట్రోల్ తో టీవీ, ఫ్యాన్ ఆన్ చేసే మెషిన్లను ఈ పదవతరగతి కూడా పాస్ కాని గ్రామీణ యువకుడు తయారుచేశారు.
మల్లేష్ గారు అందుకున్న కొన్ని అవార్డులు:
1. అమెరికా దేశంలోని ఓ సంస్థ తరుపున ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్.
2. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా రాష్ట్రపతి పురస్కారం.
3. United technology research University నుండి గౌరవ డాక్టరేట్.
4. 2016లో కేటీఆర్ గారి చేతుల మీదుగా యూత్ ఐకాన్ అవార్డ్.
ఇంకా ఎంతోమంది రైతుల తరుపున చల్లని దీవెనలు కూడా అందుకున్నారు.
