This Warangal's Hand Made Art Is At last Days Of Its Extinction & We Should Save It

Updated on
This Warangal's Hand Made Art Is At last Days Of Its Extinction & We Should Save It

వరంగల్ జిల్లాకు చెందిన చెరియాల్ ప్రాంతం నకాశి కళ ద్వారా ఓ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పొందింది. కాటమరాజు కథలు, మార్కండేయ పురాణం, జానపద కథలు, రామాయణం, మహాభారతం, స్థానిక కథలు మొదలైన వాటి గురుంచి ఈ ఆర్ట్ ద్వారా గ్రామాలకు వెళ్లి ప్రదర్శిస్తారు. ఇందులో వాడే రంగులు, బొమ్మలలో కనిపించే శారీరక భాష మన కళ్ళను, మనసును ఒకే చోట ఉంచుతుంది. గొప్ప కళలన్ని పూర్వంలోనే పుట్టాయి, కొన్ని కనుమరుగై పొతే మరికొన్ని కనుమరుగయ్యే దశలోకి చేరుకుంటున్నాయి.

ఎక్కడ ఎలా పుట్టింది?

నకాశి కళ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇరాన్ దేశంలో పుట్టిందని సాక్షి పత్రిక ప్రచురించింది. మొఘలాయులు మనదేశంలోకి అడుగుపెట్టినప్పుడే ఈ కళ కూడా వచ్చిందనంటారు. మొదట ఉత్తర భారతదేశంలో ఒక వెలుగు వెలిగి దక్షిణ భారతం చేరుకుంది. ఆ తర్వాతి కాలంలో నకాశి కులస్థుడు దనాల కోట వెంకయ్య అతని వారసులు వెంకట రామణయ్య, చంద్రయ్య, వైకుంఠం, నాగేశ్వర్ ఇలా ఒక తరం నుండి మరో తరం వారసత్వ సంపదగా కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లా చెరియాల్ ప్రాంతంలో ఈ కళ ఎక్కువ బయటకు రావడంతో నకాశి ఆర్ట్ ను చెరియాల్ ఆర్ట్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు.

పూర్తి ప్రకృతి సిద్ధంగా..

ఈ కళ ఇంత అందంగా రావడానికి కారణం కళాకారులే కాదు ప్రకృతి కూడా.. ఈ బొమ్మల్లో ఉపయోగించే ఏ రంగులోను కెమికల్, రసాయనిక ద్రవాలు ఇందులో వాడరు. పునికి చెట్టు(దీని కలపను కొండపల్లి, నిర్మల్ బొమ్మలకోసం కూడా ఉపయోగిస్తుంటారు), చింతగింజలను బాగా దంచి సిద్ధం చేసుకునే పేస్ట్, సుద్ద ముక్కలు, గవ్వలను దంచగా వచ్చే తెల్లని పొడి, ఇండిగో చెట్టు(నీలిమందు మొక్క) నుండి వచ్చే నీలం రంగు, చెక్కపొడి, కిరోసిన్ దీపం పొగ నుండి వచ్చే నలుపు ఇలా మొదలైనవే ఈ ఆర్ట్ కోసం ఉపయోగిస్తారు.

అవార్డులున్నాయి ఆకలి కూడా ఉంది:

ఇంత అందమైన ఆర్ట్ లో రామాయణ మహాభారతలు రూపొందడానికి నెలల సమయం పడుతుంది. ఒక్క బొమ్మకు అయిదు రోజుల సమయం పడుతుంది, ఒక్క రామాయణం పూర్తికావడానికి మూడు నెలలు పడుతుంది అది కూడా ఇద్దరు కష్టపడితే. 2007 లో చెరియాల్ ఆర్ట్ కు Geographical Indication గుర్తింపు రావడంతో ఈ కళ అంటూ ఒకటుందని మెజారిటీ ప్రజలకు తెలిసింది. మన కన్నా ఇతర దేశాస్థులు జపాన్, జర్మనీ, రష్యా మొదలైన దేశాలలో ఈ కళ కనుమరుగు కాకుండా ట్రైనింగ్ ఇస్తున్నారు. మన దగ్గిర మాత్రం అలాంటి చర్యలేమి లేవు. కళాకారులు ఈ కళతో జీవించలేని పరిస్థితి. నాటి కాకతీయులు, నిజాం రాజులు ఎంతగానో ఈ కళను ఆదరించారు. ప్రస్తుతం లేపాక్షి లాంటి వాటిల్లోనే అడపా దడపా కనిపిస్తున్నాయి.

మన దగ్గిర టాలెంట్ ఉండడం ఎంత ముఖ్యమో దానిని మార్కెటింగ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.. నకాశి అంతరించిపోయే పరిస్థితికి రావడానికి మార్కెటింగ్ లోపమే ప్రధాన కారణం. ఈ కళ ద్వారా తయారైన వస్తువులను కొనుగోలు చెయ్యడానికి వినియోగదారులున్నా సరైన మార్కెటింగ్, స్టాల్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. మరోపక్క దళారుల దోపిడి కూడా అధికంగానే ఉంది. ప్రభుత్వం ముందుకు వస్తే సరిపోదు వీటికి మరింత గుర్తింపు రావాలి అందుకు మనం కూడా కొనుగోలు చెయ్యడం మొదలుపెట్టాలి..

నకాశి ఆర్ట్ బొమ్మలకోసం: 9000181059(గణేష్ గారు)