మన తెలంగాణలోని అతిగొప్ప పుణ్యక్షేత్రాలలో ధర్మపురి కూడా ఒకటి. ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వం ధర్మవర్మ అనే మహారాజు నరసింహా స్వామి వారి అనుగ్రహం కోసం తపస్సు చేశారు.. తన భక్తికి మెచ్చి నరసింహా స్వామి లక్ష్మీ సమేతంగా ధర్మవర్మకు దర్శన భాగ్యం కలిగించాడు. మహారాజు ధర్మవర్మ కోరిక మేరకు ఇదే ప్రాంతంలో సతీ సమేతంగా నరసింహా స్వామి అవతరించారు. ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహా స్వామిగా, ఉగ్ర నరసింహా స్వామిగా స్వామి వారు దర్శనమిస్తారు. కరీంనగర్ నుండి సుమారు 65కిలోమీటర్ల దూరంలో ఈ పవిత్ర కోవెల ఉంది.

ఇదే ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ వేణు గోపాల స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ రాముడు, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ సంతోషిమాత వంటి దేవత ప్రతిమలు కొలువుతీరి ఉన్నాయి. ఈ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి ఉండే మరో విశిష్టత నరకంలో పాపులను శిక్షించే యమధర్మ రాజు కూడా ఇక్కడ విగ్రహ రూపంలో పూజలందుకుంటున్నారు. నరసింహా స్వామిని దర్శించుకున్న భక్తులందరూ ఇక్కడి యమ ధర్మరాజుని దర్శించుకుంటే యమపురికి వెళ్ళే అగత్యం ఉండదని భక్తుల విశ్వాసం.

ఈ దేవాలయానికి ఆనుకుని దక్షిణ దిశ గోదావరి నది ప్రవహిస్తూ ఉండడం వల్ల ప్రజలు ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశిగా భావిస్తారు. పవిత్ర పుణ్య తీర్ధంగా ఉండే ఈ గోదావరి నదిలో భక్తులు తమ పెద్దలకు మాతృ, పితృ దేవతలకు పిండప్రధానం చేస్తారు. ప్రతి 12 ఏళ్ళకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. ఈ గుడి కేవలం కరీంనగర్ కు మాత్రమే పరిమితమవ్వలేదు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న తొమ్మిది మహిమాన్విత నరసింహా దేవాలయాలలో ఈ గుడి కూడా ప్రసిద్ధమైనది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.