శివునికి, శ్రీ కృష్ణుడుకి, గణేషునికి మొదలైన దేవతలందరికి భారతదేశమంతా భక్తులుంటారు వారికి విశేషంగా పూజలు చేస్తుంటారు, కాని అయ్యప్పస్వామికి మాత్రం దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులుంటారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో భక్తితో, క్రమశిక్షణతో 40రోజులకు పైగా అయ్యప్పమాల ధరిస్తారు. సంవత్సరంలో కొన్నిరోజులు మాల ధరించినా గాని ఆ పరమ శ్రేష్టమైన నియమాలతో సంవత్సరమంతా క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం వచ్చేస్తుంది.. శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం తర్వాత మన తెలుగువారు అత్యధికంగా దర్శిస్తున్న దేవలయమే ద్వారపూడి అయ్యప్పస్వామి దేవాలయం.

ఈ అయ్యప్పస్వామి దేవాలయాన్ని ఆంధ్ర శబరిమలగా పిలుస్తారు. "అయ్య" అంటే విష్ణువు, "అప్ప" అంటే శివుడు వీరి ఇద్దరి పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టిందంటారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ద్వారపూడి గ్రామంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కొలువై ఉన్నది. కనకరాజు అనే గురుస్వామి 1983లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు.. కొన్ని అనివార్య పరిస్థితుల మూలంగా ఈ గుడి నిర్మాణం ఆలస్యం జరిగినా, తర్వాత 1989లో కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి చేతులమీదుగా పంచలోహాలతో తయారుచేయబడిన అయ్యప్పస్వామి ప్రతిమ ప్రతిష్టచేయబడినది.

శబరిమలకు ప్రతి సంవత్సరం అయ్యప్పమాల దీక్ష విరమించే సమయంలో కోట్ల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.. అక్కడి విపరీతమైన రద్దీని తట్టుకోలేని అయ్యప్ప భక్తులు ఈ ద్వారపూడి దేవలయానికి వస్తారు. ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. అత్యంత పవిత్రమైన శబరిమల దేవాలయంలో జరిగే ప్రతి పూజలు, ఆచారాలు అదే విదంగా ఇక్కడ కూడా జరుపుతారు.. శబరిమలలో ఉన్నట్టుగా అయ్యప్పను చేరుకోడానికి ఇక్కడ కూడా 18 మెట్లు ఉంటాయి. సంతానం కలగని భార్య,భర్తలు ఇక్కడి స్వామి వారిని ఆర్తితో వేడుకుంటే పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం. కలిగిన పిల్లలతో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి తులాభారంతో పిల్లల సమాన బరువుతో ఉన్న ధనాన్ని గాని, ఏదైవ వస్తువు గాని సమర్పించి మొక్కును తీర్చుకుంటారు. ఆలయంలో కొలువైన శనిదేవునికి తైలాభిషేకం చేస్తే శనిదేవుడు వారికి అడ్డురాడని భక్తుల నమ్మకం.

పేరుకు అయ్యప్పస్వామి దేవాలయం ఐనా ఇక్కడ శివుడు, శ్రీ వేంకటేశ్వర స్వామి, అంజనేయ స్వామి, సాయిబాబా, వినాయక మొదలైన ప్రతిమలతో ఈ కోవెల కొలువై ఉన్నది. ఇదే గుడిలో భూగర్భంలో ఉన్న శివాలయం కూడా చూడదగిన ప్రదేశాలలో ఒకటి. ఈ దేవాలయంలోని శివుని ప్రతిమ భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా వెండి లోహంతో ఉంటుంది. ఈ గుడికి సమీపంలో అష్టాదశ శివలింగాలతో కూడిన శివాలయం ఉంటుంది. 18 శివలింగాలతో ఉన్న ఈ గుడి నాలుగు అంతస్తులతో పాలరాతితో నిర్మించడం జరిగింది. కేవలం ఆయప్ప స్వామి మాల వేసినవారు మాత్రమే కాకుండా మిగిలిన సాధారణ భక్తులందరు దర్శించవలసిన పవిత్రక్షేత్రం ద్వారపూడి దేవాలయం.




Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.