ఆడపిల్లలపై వారి కన్నతండ్రి ఎలాంటి హక్కుదారు కాదు, యజమాని కాడు. సంరక్షకుడు మాత్రమే. ఆడపిల్లల్ని ఇతరులకు దానం చేసే హక్కు లేదు.’ - మహాత్మ గాంధీ
ప్రపంచానికి కరుడుగట్టిన నియంత హిట్లర్ ఐతే భారతదేశంలో మాత్రం బాల్యవివాహాలు జరిగే ప్రతి ఇంటిలోనూ ఒకడు ఉంటాడు.. వాడు తన నిర్ణయాన్ని ఎంతమంది అడ్డు వచ్చినా గెలిపించాలనుకుంటాడు.. ఎప్పుడో కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి కాలం కాదండి ఇప్పుడు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఓసారి పరిశీలిద్దాం..

18 సంవత్సరాల లోపు జరిగే ప్రతి వివాహం బాల్యవివాహం కిందికే వస్తుంది. యునిసెఫ్ నివేదిక ప్రకారం(2009) అత్యధిక బాల్య వివాహాలు అంటే 40% వివాహాలు మనదేశంలోనే జరుగుతున్నాయి.. యాక్షన్ ఎయిడ్ ఇండియా వారు 2011 బాల్యవివాహాల నిర్మూలన కోసం చేసిన సర్వేలో మరిన్ని వాస్తవాలు బయటపడ్డాయి.. గ్రామీణ ప్రాంతాలలో 75% బాల్యవివాహాలు జరుగుతున్నాయి. 2011 నివేదిక ప్రకారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజాస్థాన్, బీహార్ లలో జరిగిన వివాహాలలో 70% 18 సంవత్సరాల లోపు జరిగినవే.
మన దేశంలో పిల్లల హక్కుల కోసం ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్(ఎన్.సి.పి.సి.ఆర్) ఈ మధ్య కాలంలో విడుదల చేసిన సర్వే ప్రకారం దేశంలో జరిగే వివాహాలలో 47% జరిగేవి బాల్యవివాహాలే.. 2006 బాల్యవివాహ నిరోధక చట్టం ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండితేనే వివాహానికి అర్హులు, వీటిని అతిక్రమించినా, ప్రోత్సహించినా కాని సెక్షన్ 10 ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదంటే లక్షరూపాయల జరిమానా విధిస్తారు ఒక్కోసారి ఈ రెండు జరుగుతాయి కూడా..

(వయసు నిండిన మహిళ) మామూలుగానే ఒక కానుపుకు మరో కానుపుకు కనీసం 3 సంవత్సరాల తేడా ఉండాలి అప్పుడే బిడ్డకు, తల్లికి సంపూర్ణ ఆరోగ్యం: 1. చిన్న వయసులోనే పెళ్లి జరిగిన వారే పూర్తిగా ఎదగలేదు ఇక తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఎదగగలదు.? 2. 18 సంవత్సరాల లోపు అంటే ఆ అమ్మాయి ఎంత వరకు చదువుకోగలదు? తన కాళ్ళ మీద తాను నిలబడగలదా.? 3. లేత వయసులోనే గర్భం రావడం వల్ల కాన్పు సరిగ్గా జరగక ప్రసూతి మరణాలకు అధిక అవకాశం ఉంది. 4. ఆ వయసులోని తల్లులకు పాలు రావు. వీరు చేసిన పనికి పుట్టబోయే బిడ్డ కూడా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది.

మనదేశం మహిళను ఎలా వాడుకుంటుందో ఇక్కడ ఒక చిన్న ఉదాహారణతో తెలుసుకోవచ్చు. నాడు కన్యాదానం చేసేటప్పుడు వరుడే ఎదురు కట్నం ఇచ్చి అంటే కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు, అందువల్ల ఆడపిల్ల పుట్టిందంటే ఒక వస్తువుగా కొందరు అమ్మేసేవారు. బాల్య వివాహాల సమస్యను బేస్ చేసుకుని గురజాడ అప్పారావు గారు 1897 లో కన్యాశుల్కం పుస్తకాన్ని రాశారు. నాటి కాలంలో సంవత్సరానికి 344 బాల్యవివాహాలు జరుగుతున్నాయని పుస్తక పీఠికలోనే వివరించారు. ఆ పుస్తకంలో గణాంకాలు కూడా పొందుపరిచారు.. సంవత్సరం కూడా నిండని ముగ్గురు ఆడపిల్లలు, రెండేళ్ల లోపు జరిగిన వివాహాలు 36, మూడేళ్ల లోపు జరిగిన వివాహాలు 44, ఐదేళ్ల లోపు జరిగిన వివాహాలు 99.. వింటూంటేనే మన ప్రపంచం ఆగిపోతుంది కదా.. మహిళలు మన దేశంలో ఎంతటి గడ్డు పరిస్థితిని అనుభవించారో, అనుభవిస్తున్నారో తేటతెల్లమయ్యింది. నిన్నటి సంఘటనలకు నేడు మనం విచారిస్తున్నాం, నేటి సంఘటనలకు రేపు మరొకరు ఖచ్చితంగా విచారిస్తారు.

మనదేశంలోని 99% మహిళలు వ్యభిచార వృత్తిని వారి లక్ష్యంగా ఎంచుకోరు. పరిస్థితులు, చుట్టూ ఉన్న సమాజం(ముఖ్యంగా పురుషులు) వారిని ఈ దారికి పంపిస్తున్నారు.. మన దేశాన్ని ఒక మహిళతో పోలుస్తారు.. మన దేశంలో అన్నిటికీ మహిళే కావాలి.. తమ ఎదుగుదలకు ఆటంకం అని నిందించడానికి మహిళే కావాలి.. గర్భంలోనే చంపడానికి.. ఇంట్లో సోదరుడితో సమానంగా చూడకుండా వివక్ష చూపడానికి.. యుక్త వయసు వచ్చాక ఎవరికో తెలియని వాడికి ఇచ్చి ఇంట్లో నుండి తరిమేయడానికి.. జాగ్రత్తలు చెప్పడానికి.. నీ నడవడిక మీదే మన కుటుంబ పరువు, బరువు, బాధ్యతలు ఆధారపడి ఉన్నాయని పంజరంలో బంధించడానికి.. చిన్నపిల్లలకు పీరియడ్స్ వచ్చేలా హార్మోన్ ఇంజెక్క్షన్లు ఇచ్చి వ్యభిచారంలోకి లాగడానికి.. వేల సంవత్సరాలు గడుస్తున్నా బాల్య వివాహాలకు కూడా జరుగుతున్నాయి చూడండి.. మనదేశంలో మహిళలకు ఇంతటి అవకాశాలు ఇస్తున్నాము కనుక మరోసారి గట్టిగా అరుద్దాం భారత్ మాతాకి జై.. భారత్ మాతాకి జై.!!