శ్రీ మహావిష్ణువుని దశావతారములలో ఆరవ అవతరం పరశురామావతారము. రాచరికం, అధికారం అడ్డుపెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్షత్రియులను తన గండ్ర గొడ్డలితో నరికేసిన తరువాత ఆ పాప పరిహారార్ధం పరమేశ్వరుడుని వేడుకుని దేశమంతటా నాలుగు మూలలా 108 శివలింగాలను ప్రతిష్టించారు. ఈ శివలింగాలు ఇప్పుడు దేశమంతటా మహిమాన్విత దేవాలయాలుగా పూజలందుకుంటున్నాయి. పరశురాముడు ప్రతిష్టించిన చివరి 108వ శివలింగమే నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్న శివలింగం. కేవలం శివలింగాలను ప్రతిష్టించడమే కాకుండా శివలింగ ప్రతిష్టాపన చేసే సమయంలో కొన్ని ఏళ్ళు తపస్సు చేసి ఆ ఆలయాలకు దివ్యత్వం అందేలా తపస్సు చేశారు. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కొలువై ఉంది.
పరశురాముడు ప్రతిష్టించిన శివలింగంపై జడలు లాంటి రేఖలు ఉండటంతో పాటు, కొండ క్రింది ప్రాంతంలో పార్వతి అమ్మవారు కొలువై ఉండటం, ఇంకా పరశురాముడు ప్రతిష్టించడం మూలంగా ఇక్కడి స్వామి వారిని "పార్వతి జడల రామలింగేశ్వరుడిగా" కొలుస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి జరిగే గ్రామోత్సవ పండుగలో పాల్గొనడానికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారిని మనసారా దర్శించి పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని స్వామివారిని దర్శించుకోవడం వలన మానసిక పరమైన ఒత్తిడులు, శారీరకపరమైన వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఇక్కడ స్థానికంగా ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. శివలింగాన్ని ప్రతిష్టించిన ప్రతి ప్రదేశంలో పరశురాముడు శివుని ప్రసన్నం కోసం తపస్సు చేసేవారు అలాగే ఈ ప్రదేశంలో కూడా పరశురాముడు శివుని దర్శనం కోసం తపస్సు ప్రారంభించారు.. కాని ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఆగ్రహంతో పరశురాముడు తన గొడ్డలితో శివలింగంపై ఒక దెబ్బ వేశాడట, అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంత కాలం నువ్వు తపస్సు చేసిన ఈ ప్రాంతం ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతుందని కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటానని చెప్పాడట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.