గోదావరి జిల్లాలు అంటేనే పచ్చని ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే వర్షాలు సంవృద్ధిగా పడుతుండడం, నీటి కష్టాలు అంతగా లేకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రకృతి పచ్చని చీర కట్టుకున్నట్టుగా అందంగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు మాత్రమే కాకుండా కొన్ని గొప్ప దేవాలయాలకు కూడా నెలవు. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పవిత్రమైన దేవాలయం ఇదే ప్రాంతంలోని ఆత్రేయపురానికి సమీపంలోని ర్యాలీ గ్రామంలో ఉన్నది. ఆ దేవాలయమే శ్రీ జగన్మోహిణి కేశవస్వామి దేవాలయం.

ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ధంలో నిర్మించినప్పటికి ఈ గుడికి హిందూ సంస్కృతిలో ఒక పురాణగాధ ఉంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మధనంలో పాల్గొన్నప్పుడు అమృతం ఉద్భవిస్తుంది. ఈ అమృతం కేవలం మాకు దక్కాలంటే మాకు దక్కాలని దేవతలు, రాక్షసులు పోట్లాడుకుంటారు. ఒకవేళ అమృతం రాక్షసులకు దక్కితే జరగకూడని విపత్తు సంభవిస్తుందని శ్రీ మహావిష్ణువు అందమైన జగన్మోహిని రూపంలో వచ్చి తన లీలా వినోదంతో అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే అందిస్తాడు.

ఆ తర్వాత జగన్మోహిని రధం మీద తిరిగి వస్తుండగా స్వామి వారి రధం శిల ఈ ప్రాంతంలో రాలిపోతుంది. అదే సమయంలో పరమేశ్వరుడు జగన్మోహినీని చూసి మోహింపబడి వెంబడిస్తారు. అలా రధం మీద వెలుతున్న సమయంలో జగన్మోహిని పరమేశ్వరులు శారీరకంగా కలిశారని వారి కలయిక ఫలితంగా అయ్యప్ప స్వామి వారు జన్మిస్తారు. జగన్మోహిణి జడలో నుండి ఒక పువ్వు ఇక్కడ పడడంతో ఆ పువ్వే దేవాలయంగా మారిందని కథనం.

అలాగే ఇక్కడ ఆలయ నిర్మాణానికి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది.. శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడైన విక్రమ దేవుడు అనే రాజు అప్పటి ర్యాలీ దట్టమైన అడవులకు వేటకు వచ్చాడు. వేటలో విపరీతంగా అలసిపోయిన విక్రమ దేవుడు ఒక చెట్టు కింద నిద్రపోయాడట.. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతని స్వప్నంలోకి వచ్చి "నేను ఫలానా చోట స్వయంభూ గా వెలిశాను, అందుకోసం నువ్వు ఒక రధాన్ని తయారుచేసి తాడుతో ఈ ప్రాంతంలో లాగితే ఒక ప్రత్యేకమైన చోట ఆ రధం శిల రాలుతుంది. అలా రాలినచోట తవ్వితే ప్రతిమ రూపంలో ఉన్న నేను దర్శనమిస్తానని చెప్పారట". శ్రీ మహావిష్ణువు కలలో చెప్పినట్టుగానే అంతా జరిగిపోయింది. అలా విక్రమదేవుడు మొదటిసారి ఈ ఆలయాన్ని నిర్మించారట. అయోద్య, రామేశ్వరం, కాశి, పండరీపురంలో కూడా జగన్మోహిని వారు పూజలందుకుంటున్నా గాని అక్కడెక్కడా లేని పవిత్రత, చరిత్ర ఈ ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి వారికి ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో ఈ దివ్య దేవాలయాన్ని దర్శించుకుంటారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.