Contributed By Doli Veera Durga
బాబూ నలుగురు కూలీలు కావాలి.. ఉద్దేష్ నిర్జీవమైన గొంతుతో అడిగాడు. ఒకరికి ఐదువందల చప్పున మొత్తం 2000 అవ్వుద్ది ,అక్కడ గుంపులో ఒకడన్నాడు, నేనంత ఇచ్చుకోలేను బాబు ఒకరికి 300 చొప్పున ఇవ్వగలను. అయినా ఇది బేరా లాడే సమయం కాదు, అవతల మా నాన్నగారి దేహం, అనాధ శవంలా పడి ఉంది. దానిని స్మశానం వరకు చేర్చడానికి సాయం చేయండి.. అని ఉద్దేష్ ప్రాధేయ పడ్డాడు, అందరూ శవం దగ్గరకు చేరుకున్నారు.
పూజ, తండ్రి శవం దగ్గర కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ నలుగురి చేత పాడి కట్టించి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాడు ఉద్దేష్. ఇరుగు-పొరుగు ఎవ్వరూ సాయం చేయడానికి రావడం లేదు. కూలీ వారు నలుగురూ, పాడిని నాలుగు వైపులా పట్టుకోగా కొంచెం ముందుగా ఉద్దేష్ నడుస్తున్నాడు. వీళ్ళకు కొంచెం దూరంగా పూజ ఏడుస్తూ నడుస్తుంది. ఆ వీధి లోని వారు జాలితో సాయం చేయడానికి రాకపోగా, ఆడవాళ్లు, వీళ్ళకు ఇలా జరగాల్సిందే అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. మగవారు పూజను కన్నీటితో, చమటతో తడిచిన పూజ జాకెట్ ను, పూజ శరీరాన్ని తదేకంగా చూస్తూ ఏవో గుసగుసలు ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు.
తండ్రి పోయాడన్న దుఃఖం ఒకవైపు, దహన కార్యక్రమాలు సజావుగా సాగుతాయో లేదోనన్న సంశయం ఇంకోవైపు, ఏ క్షణంలో అయినా పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేయొచ్చు అన్న కంగారు మరోవైపు ఉద్దేష్ ముఖంలో తాండవిస్తున్నాయి.
స్మశానం సమీపించింది ,ఏది జరుగుతుందని ఇంతసేపు ఉద్దేష్ భయపడుతున్నాడో అదే జరిగింది .పోలీసు జీపు వచ్చి వారి ఎదుట ఆగింది ,వెంటనే నలుగురు కానిస్టేబుల్స్ ఉద్దేష్ ని చుట్టుముట్టారు ,ఎస్ఐ వచ్చి ఉద్దేష్ చేతులకు సంకెళ్లు వేసాడు.
పూజ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండగానే ,ఉద్దేష్ ను జీపు ఎక్కించారు . సార్ మా నాన్న దహన సంస్కారాలు జరిపించి,వెంటనే వచ్చేస్తానని ఉద్దేష్, ప్లీజ్ సార్ మా అన్నయ్యను వదిలేయండి , తను ఏం తప్పు చేశాడు అని పూజ ఎంత బతిమాలినా లెక్కపెట్టకుండా ఎస్ఐ జీపు ని ముందుకి పోనిచ్చాడు .పూజ జీపు ముందుకెళ్లి, ఆపే ప్రయత్నం చేసింది కానీ ఎస్ఐ జీపు దిగి ఆమెను పక్కకి నెట్టి ,జీపు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
అన్నయ్యా అన్నయ్యా అంటూ పూజ కొంత దూరం జీపు వెనుక పరుగెట్టింది ,కానీ జీపు అందనంత వేగంతో కనుమరుగయ్యింది . పూజకు ఏం చేయాలో అర్థం కావడంలేదు, చేతిలో రూపాయి లేదు.
పొద్దు పొద్దున్నే డబ్బులు లేని బేరం తగిలింది రా... అని విసుక్కుంటూ శవాన్ని రోడ్డు మీదే వదిలేసి ,కూలి వారు వెళ్లిపోయారు . పూజకు పిచ్చి ఎక్కినంత పని అయ్యింది . రోడ్డుపై వాహనాలు అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఎండ భగ భగ మంటుంది ,పూజ తన రెండు చేతులతో ఎలాగో తండ్రి శవాన్ని రోడ్డు కి కొంచెం పక్కగా ఈడ్చుకుంటూ వచ్చి ,అక్కడ ఉంచింది. తండ్రి మొఖానికి ఎండ తగలకుండా తన పైట కొంగును అడ్డుగా కప్పింది, పక్కనే తను కూర్చుని ఏడుస్తూ ఉంది, అన్నయ్య వస్తాడని ఎదురుచూస్తూ ఉంది .పొద్దు పోతుంది చీకటి పడితే ఇంక ఈరోజు దహన సంస్కారాలు చేయడం సాధ్యపడదు ,అని స్మశానం నుండి వచ్చిన కాటికాపరి పూజ ను హెచ్చరించాడు. అప్పుడు పూజ ఏడుస్తూ కాటికాపరికి దణ్ణం పెట్టి ,దయచేసి మా నాన్న గారి దహన సంస్కారాలు జరిపించండి అని ఆయన కాళ్ల మీద పడి ప్రాధేయపడింది. కాటికాపరి సాయంతో శవాన్ని స్మశానం లోనికి తీసుకు వెళ్ళింది. అక్కడ ఉన్న కట్టెలను ఇద్దరూ కలిసి పోగుచేశారు. కట్టెలపై తన తండ్రి శవాన్ని చూసి కన్నీరు మున్నీరు అవుతుంది పూజ. కట్టెలు అమర్చడం పూర్తయింది .తలకొరివి పెట్టడానికి పూజ కట్టె వెలిగించగా ,నువ్వు ఆడ కూతురివి , ఆడవాళ్ళు తలకొరివి పెట్టకూడదు ,కొడుకులే పెట్టాలి ,ఇదీ మన హిందూ ధర్మం . నువ్వు చేసేది సాంప్రదాయ విరుద్ధం అని కాటి కాపరి అన్నాడు . అప్పుడు పూజ... సాంప్రదాయాలు ,ధర్మాలు ఎవరు పెట్టారండి ? మనుషులేగా.. అయినా నా తండ్రి దిక్కులేని చావు చచ్చినప్పుడు ఏ సాంప్రదాయం కాపాడగలిగింది ? , నా అన్నని అన్యాయంగా పోలీసులు తీసుకు పోయినప్పుడు ఏ ధర్మం అడ్డుపడింది.? అని ప్రశ్నించింది . మనకు మేలు చేయని వాటిని మనం గౌరవించి పాటించనవసరం లేదు, అని చివరి సారిగా తన తండ్రి ముఖాన్ని చూసుకొని ,తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుని కడసారి వీడ్కోలు పలికినట్లుగా ,నాన్నా అని ఏడుస్తూ వెనక్కి తిరిగి తలకొరివి పెట్టింది. కట్టెలు కాలే వరకు ఆగి ,బూడిద తీసుకుని వెళ్ళమని కాటి కాపరి సూచించాడు .పూజ అక్కడే అలా కూర్చుండి పోయింది . అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఉద్దేష్. కాలుతున్న తండ్రి శవాన్ని చూసి తలకొరివి ఎవరు పెట్టారు, అని అడిగాడు. పూజ ఒక్కసారిగా అన్నయ్యను కౌగిలించుకుని ,అన్నయ్యా నాన్నకు నేనే రెండో కొడుకుని అయ్యి, ఈ చేతులతో తల కొరివి పెట్టాను.. అని రెండు చేతులతో తన తలను బాధుకుంది. ఉద్దేష్ చెల్లిని బాధ పడద్దని వారించి ,తండ్రికి తలకొరివి పెట్టలేని తన దురదృష్టానికి బాధపడుతూ ఏడుస్తూ , చెల్లెలి భుజాలపై చెయ్యి వేసి తీసుకొని వెళ్లి పక్కన గట్టు మీద కూర్చోబెట్టాడు. కాటికాపరి వైపు కృతజ్ఞతా భావంతో ఒక సారి చూసాడు .చెల్లెలితో నీకు తినడానికి ఏమైనా తీసుకువస్తానని వెళ్ళబోయే లోగా ,పూజ అన్నయ్య చెయ్యి పట్టుకుని ఆపి ,అసలు నాన్న ఎందుకు చనిపోయారు.? నిన్ను పోలీసులు ఎందుకు తీసుకువెళ్లారు.? అని అన్నయ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది .ఇప్పుడు పూజ కళ్ళల్లో కన్నీరు కి బదులు ఆవేదన ఉద్భవించింది. ఉద్దేష్ తన రెండు చేతులతో పూజ ముఖాన్ని పట్టుకుని ,మన కుటుంబానికి ఈ దుస్థితి పట్టించిన ఆ సంఘటన నిన్న ఉదయం జరిగింది అమ్మా …..అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నిన్న నాన్న మంత్రి గారి ఇంట్లో వాస్తు పూజ ఉందని పొద్దున్నే బయలుదేరి వెళ్లి, సాయంత్రానికి ఖంగారుగా ,భయంతో వళ్ళంతా చెమటలతో ఇంటికి వచ్చాడు గుర్తుందా. నిన్న నాన్న మంత్రి ఇంటికి వెళ్ళినప్పుడు,అక్కడ…………
నాన్నని చూసి మంత్రి గారి భార్య పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నాం , అలా గదిలో కూర్చోమని చెప్పి వెళ్ళిపోయింది. ఇది తెలియని మంత్రి నాన్న కూర్చున్న పక్క గదిలో తన మేనేజర్ తో తన చీకటి వ్యాపారాల గురించి , రహస్యాలు మాట్లాడుతున్నాడు. మంత్రి తన మేనేజర్ తో జాతీయ ,రాష్ట్రీయ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఫైనల్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల వివరాలు వచ్చాయా..? అని అడిగాడు ,వెంటనే మేనేజర్ ఇదిగో సార్ ఈ లిస్టు మనకు డబ్బులు ఇచ్చిన వాళ్లది, ఇది ఇవ్వని వాళ్ళది, అని రెండు పేపర్లు మంత్రిగారి చేతిలో పెట్టాడు. మంత్రి కొంచెం సేపు ఆలోచించి మనకు డబ్బులు ఇవ్వని లిస్టులో ఉన్న వారందరినీ ఎలాగోలా అమ్మాయిలకి డ్రగ్స్ కి మందు సిగరెట్లకు బానిసలు అయ్యేలా చెయ్యమని, ఎదో ఒక కేసులో ఎఫ్. ఐ.ఆర్ బుక్ చెయ్యమని మనవాళ్లకు చెప్పు . ఎలాగోలా వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేయించి ,చదువుపై వాళ్ళ ఏకాగ్రత దెబ్బతినెలా చెయ్యాలి. అప్పుడే వారు ఫైనల్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి ,మనకు కావలసిన వాళ్లు పాస్ అవుతారు. కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తుంది ఇదే కదా సార్. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది ,కానీ సార్ కొన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, కార్మికుల యూనియన్లు వాళ్లకు సకాలంలో పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ లాంటి అలవెన్సులు చెల్లించడం లేదని ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నాయి సార్. చూడయ్యా మేనేజరూ వీళ్ళందరికీ టైముకి ప్రతినెలా ఇ.ఎస్.ఐ ,పీ.ఎఫ్ లాంటి అన్ని అలవెన్సులు ఇచ్చేస్తే, ఆ మొత్తం డబ్బు మన అకౌంట్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే అవకాశం మనకు ఉండదు. అందువలన మనకు ఆ మొత్తం డబ్బుకు, మన బ్యాంకు వారు మనకు చెల్లించే లక్షల రూపాయల వడ్డీలను మిస్ అవుతాం. అందుకని రెండు రోజులు ధర్నాలు, రాస్తారోకోలు చేసుకోనీ . తర్వాత ఇంకో కొత్త సమస్యని మనమే సృష్టించి ,వాళ్ళ అందరి దృష్టిని దానిపై పడేలా చేసి ఆ సమస్యను మనమే పరిష్కరించి, పాత గొడవలు ,పాత సమస్యలు అందరూ మరిచిపోయేలా చేద్దాం. ఇదేనయ్యా రాజకీయం అంటే . ఉద్యోగులు , కార్మికులు , ప్రజలు చాలా బిజీ అయ్యా. వాళ్లకి ఉద్యమాలు ,పోరాటాలు చేసేంత ఓపిక , టైమూ రెండూ ఉండవు.పాల పొంగు లాంటిది వాళ్ళ ఆవేశం, మనం నీళ్ళు జల్లితే తుస్సు మంటుంది. అంటూ చెబుతున్న మంత్రి మాటలు, మేనేజర్ శ్రద్ధగా వింటూ అవునన్నట్లు తలూపాడు. పక్క గది కిటికీ నుండి ఇవన్నీ వింటున్న శాస్త్రికి ముఖమంతా చమటలు పట్టి, భయంతో వణుకుతున్నాడు. ఒకవైపు మంత్రి ప్రజలకు చేస్తున్న మోసానికి ఆవేశం వస్తుంది ,ఇంకోవైపు తనకి ఇవన్నీ తెలిశాయి అని మంత్రికి తెలిస్తే ఏం చేస్తాడో అనే గుబులు పుడుతుంది. మొకానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ శాస్త్రి తన గది నుండి బయటకు వస్తుండగా ,అదే సమయంలో మంత్రి, మేనేజరు మాట్లాడుకుంటూ తమ గది నుండి బయటకు వస్తున్నారు. ఆ ఇద్దరిని చూడగానే శాస్త్రి మొహంలో కంగారు, తడబాటు స్పష్టంగా మంత్రికి కనబడ్డాయి. తాము మాట్లాడుకున్న విషయాలన్నీ శాస్త్రి విన్నాడని మంత్రికి అర్థమైంది. మంత్రి వెంటనే ఎవరు నువ్వు .? అని ప్రశ్నించాడు. శాస్త్రి వెంటనే మీ ఇంట్లో వాస్తు పూజ చెయ్యడానికి అమ్మగారు పిలిపించారు సార్ ! అని కంపిస్తూ బదులిచ్చాడు. మేము మాట్లాడుకున్న విషయాలు నువ్వు విన్నావ్ అన్న సంగతి మాకు తెలుసు. వాటిలో ఏ ఒక్కటి , నువ్వు బయట ఎక్కడైనా చెబితే ,నీకు నీ కుటుంబానికి చాలా ప్రమాదం ,గుర్తుపెట్టుకో..! అని మంత్రి, శాస్త్రిని బెదిరించాడు. శాస్త్రి భయంతో ఏమీ మాట్లాడలేదు .పూజ చేసి, వారు ఇచ్చింది పుచ్చుకుని అక్కడి నుండి బయలుదేరాడు .ఎందుకైనా మంచిదని శాస్త్రిని వెంబడించమని తన మనుషుల్ని పురమాయించాడు మంత్రి. మంత్రి ప్రజలకు చేస్తున్న అన్యాయం ,ద్రోహం తలుచుకుంటే శాస్త్రి గుండె మండి పోతుంది .కానీ తను మాత్రం ఏం చేయగలడు.? పోలీసు కంప్లైంట్ ఇద్ధమా? వద్దా? అనే సంశయం లో ఉండిపోయాడు శాస్త్రి .మంత్రి ప్రజలకు చేస్తున్న ద్రోహం ఒకవైపు, తనకి ఏమన్నా అయితే ఇద్దరు పిల్లలు ఏమైపోతారో అన్న బాధ మరోవైపు శాస్త్రిని పీడిస్తున్నాయి. శాస్త్రి మనస్సాక్షి మాత్రం ప్రజల పక్షాన నిలబడమంది, పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ముందుగానే ఎస్. ఐ తో అంతా మాట్లాడి పెట్టాడు. ఎస్.ఐ నామమాత్రంగా శాస్త్రి దగ్గర ఫిర్యాదు తీసుకుని శాస్త్రిని పంపించేశాడు. ఇంక శాస్త్రిని , శాస్త్రి కుటుంబాన్ని ప్రాణాలతో వదలడం మంచిది కాదని మంత్రి నిశ్చయించుకున్నాడు. ఇంటికి వచ్చిన తండ్రిని చూడగానే , పూజ చకాచకా వచ్చి ,తండ్రి చేతి లోని సంచిని తీసుకుని , కాళ్ళు కడుక్కుని రండి నాన్న అన్నం వడ్డిస్తాను అంది. శాస్త్రి మాత్రం జరిగిన సంఘటన ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. తండ్రి మొహంలో కంగారు, భయం ఉద్దేష్ కి స్పష్టంగా కనబడుతున్నాయి, ఏం జరిగిందని తండ్రిని ప్రశ్నించాడు . శాస్త్రి ఇల్లంతా ఒకసారి పరికించి చూసి, పూజ వంటగదిలో ఉందని నిర్ధారించుకున్న తరువాత జరిగిన విషయమంతా ఉద్దేష్ కి వివరించి చెప్పాడు. మంచి పని చేశారు నాన్నా! ఇలాంటి రాజకీయ నాయకులను ఊరికే వదలకూడదు , పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇంక వాళ్లే చూసుకుంటారు. మీరు ఇంకేమీ కంగారు పడకండి ,భోజనం చేద్దాం పదండి అని తండ్రిని భోజనానికి తీసుకెళ్లాడు ఉద్దేష్. మేనేజర్ ద్వారా శాస్త్రి కుటుంబ వివరాలు తెలుసుకున్న మంత్రి , జరిగిన విషయమంతా శాస్త్రి తప్పకుండా తన కూతురుకి ,కొడుకుకి చెప్పివుంటాడు అన్న నిర్ణయానికి వచ్చి ,ఆ ముగ్గురిని ప్రాణాలతో వదలకూడదని ,తను చెప్పినట్లు చెయ్యమని మేనేజర్ కి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. నాన్నగారూ కాఫీ తీసుకు రమ్మంటారా.. అని పూజ అడిగిన ప్రశ్నకు ఈ లోకం లోకి వచ్చిన శాస్త్రి,తెమ్మని తలూపాడు. కాఫీ తాగుతూ ఉద్దేష్ ఆఫీస్ కి వెళ్లి పోయాడా.. అని అడిగాడు. అన్నయ్య పొద్దున్నే వెళ్ళిపోయాడు నాన్న అంది పూజ. నాన్నా నేను బజారు కెళ్ళి కూరగాయలు తీసుకువస్తా, అని చెప్పి పూజ బయలుదేరి వెళ్లింది. పూజ వెళ్ళిన కొద్దిసేపటికి నలుగురు మనుషులు శాస్త్రి ఇంటికి వచ్చి బయటనుండే ,ఒరేయ్ శాస్త్రి, బయటకు రా రా నీ కూతుర్ని హోటల్ కి తీసుకు వస్తానని చెప్పి మా దగ్గర అయిదు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ,వేరే కస్టమర్ దగ్గరికి పంపిస్తావా... అని అరుస్తున్నారు. ఆ మాటలు విన్న శాస్త్రికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. వెంటనే శాస్త్రి తేరుకుని ఎవరు మీరు.. ఏం మాట్లాడుతున్నారు..అని వారిని ఉద్దేశించి ప్రశ్నించాడు. ఇంతలో ఆ నలుగురిలో ఒకడు వచ్చి ,శాస్త్రి చొక్కా పట్టుకుని ఈరోజు రాత్రి గాని నీ కూతురుని మా దగ్గరికి పంపక పోతే మేము ఇచ్చిన అయిదు వేలను వడ్డీతో సహా వసూలు చేస్తాం జాగ్రత్త..! అన్నాడు. ఈ గొడవను ఇరుగుపొరుగు వారు వచ్చి ,చూస్తూ తమలో తాము ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ నలుగురులో మరొకడు శాస్త్రిని చూస్తూ, నటించింది చాలు రా నువ్వు ,నీ కూతురు చేస్తున్న వ్యభిచారం తెలియని వారెవ్వరు? గుర్తుంచుకో ఈ రోజు రాత్రికి నీ కూతుర్ని పంపించాలి! అని దబాయించి ఆ నలుగురు వెళ్లిపోయారు. చుట్టుపక్కల వారు అందరూ శాస్త్రిని అదోరకంగా చూస్తున్నారు . అవమాన భారంతో అక్కడ నిలబడలేక శాస్త్రి లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు . పూజ కూరగాయల సంచి పట్టుకుని నడుచుకుంటూ తాము ఉంటున్న వీధి లోకి అడుగుపెట్టింది .ఇంతలో ఒక కారు వచ్చి ఆగింది ...అందులో నుండి ఇద్దరు కుర్రాళ్ళు దిగి, చూడు పాపా... నీది చాలా బిజీ షెడ్యూల్ అంట కదా,అందుకే ముందే అడ్వాన్స్ ఇచ్చి రేపు రాత్రికి నిన్ను బుక్ చేసుకుంటున్నాం .రేపు రాత్రి పది గంటల కల్లా, సవేరా హోటల్ రూమ్ నెంబర్ 321 కి వచ్చేయ్ ! అని చెప్పి ఐదువేల రూపాయల కట్ట తీసి పూజ చేతిలో ఉన్న కూరగాయల సంచిలో వేశారు. జరుగుతున్న దారుణం, పూజకి ఏమీ అర్థంకావడం లేదు. వీధిలో అందరూ తన వైపే చూస్తున్నారు. వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు కారు ఎక్కి వెళ్లి పోతుండగా ,పూజ సంచిలోని డబ్బు కట్టని తీసి కారు కేసి కొట్టింది. కారు వెళ్లిపోయింది, పూజ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంతకుముందు వరకు వీరిది సంప్రదాయమైన కుటుంబం అని మెచ్చుకున్న ఆ వీధి వారంతా ఇప్పుడు వీరిని బజారు మనుషులుగా చూస్తున్నారు. పూజ ఏడుస్తూ ఇంటికి వచ్చి తలుపు కొట్టింది ,తలుపు తెరిచిన తండ్రిని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ జరిగిన విషయమంతా తండ్రికి చెప్పింది. ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుని అవమాన భారంతో ఏడుస్తున్నారు. ఇంతలో ఉద్దేష్ ఇంటి బయట పోలీసు జీపు దిగి, పరిగెత్తుతూ లోపలికి వచ్చాడు, ఏడుస్తున్న తండ్రిని చెల్లిని చూసి జరిగింది తెలుసుకుని కూలబడిపోయాడు. ఉద్దేష్ పూజ కు ధైర్యం చెప్పి ,వెళ్ళి మొఖం కడుక్కుని కాసేపు పడుకోమని పంపించాడు. అక్కడే కూర్చుని ఏడుస్తున్న తండ్రితో ఇదంతా చేయిస్తున్నది ఆ మంత్రే నాన్నా, మనపై పగ సాధిస్తున్నాడు.చట్టం, న్యాయం అన్నిటినీ డబ్బుతో కొనేసాడు. ఈ రోజు మా ఆఫీసులో నా కౌంటర్ లో పెట్టిన డబ్బుల్లో పది వేలు తగ్గాయి . నేనే దొంగతనం చేశానని ఆఫీసులో అందరూ అనుకుంటున్నారు. పోలీసులకి ఫోన్ చేస్తే వారు నన్ను స్టేషన్ కి తీసుకెల్లి విచారించి ,రేపటిలోగా డబ్బు మొత్తం కట్టాలని వార్నింగ్ ఇచ్చి మన ఇంటి దాకా పోలీసు జీపులో తీసుకొచ్చి,వదిలి వెళ్లారు. మన చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా చూసారు. మన పరువు మొత్తం పోయింది నాన్న అన్నాడు. వీటన్నిటికీ కారణం అయిన ఆ మంత్రిగాడిని ప్రాణాలతో వదలను, అని లేచి వెళ్తుండగా తండ్రి వద్దని ఆపాడు. బలవంతులను ,బలహీనులు ఏమీ చెయ్యలేరు... అయినా నీకు ,నాకు ఏమన్నా అయితే పెళ్లి కావలసిన మీ చెల్లి ఏమైపోతుందో ఆలోచించావా! అని వారించాడు. ఆ రాత్రి ఇంట్లో ఎవ్వరూ భోజనం చెయ్యలేదు, ఎవ్వరికీ కంటిమీద కునుకు లేదు. శాస్త్రి ఆలోచనలో పడ్డాడు , అనవసరంగా మంత్రికి ఎదురెళ్లి…. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.. నావల్ల పిల్లలు రోడ్డున పడ్డారు ,అనుకుంటూ మదన పడుతున్నాడు. తెల్లారి ఐదు గంటల పది నిమిషాలకు ఒక ఆలోచన వచ్చింది శాస్త్రికి,వెంటనే దానిని ఆచరించాడు. రోజులాగే కాఫీ తీసుకుని శాస్త్రి గదికి వెళ్లిన పూజ , అక్కడ పైన దూలానికి కట్టిన తాడుకి వేలాడుతున్న తండ్రిని చూసి.. కెవ్వున అరిచింది . ఉద్దేష్ వచ్చి చూసి వెంటనే తండ్రిని కిందకి దించి, ప్రాణం లేదని తెలుసుకుని గుండెలు పగిలేలా ఏడ్చాడు. జరగాల్సిన కార్యక్రమం కోసం ఇద్దరూ వెళ్లి చుట్టుప్రక్కల వారిని సాయం అడగగా, మీలాంటి వారికి సాయం చేస్తే పాపం తగులుతుంది అని అందరూ ఛీ కొట్టారు. స్మశానం అంతా నిర్మానుష్యంగా ,నిశ్శబ్దంగా ఉంది. అన్నయ్య చెప్పినదంతా విని పూజ నిశ్చేష్టురాలైంది. తన పైట కొంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది, తండ్రి చితాభస్మాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఉద్దేష్ .ఇద్దరూ ఒక్కసారి కాటి కాపరికి నమస్కరించి ఇంటిదారి పట్టారు. పొద్దుట నుండి ఏమి తిననందువలన ఇద్దరికీ కనీసం ఏడ్చే ఓపిక కూడా లేదు. పోలీసులనుండి తప్పించుకుని పారిపోయి వచ్చిన సంగతి గుర్తుకు వచ్చి ఉద్దేష్ కి ఏమిచెయ్యాలో తోచడం లేదు. తన చెల్లెలి పరిస్థితి ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. ఉద్దేష్ గుండె ప్రతీకారంతో రగిలిపోతుంది. పూజను వంట చెయ్యమని చెప్పి తను బయటకి వెళ్లి వచ్చాడు. తాను తెచ్చిన కత్తిని మంచంపై దిండు కింద ,పూజ చూడకుండా జాగ్రత్తగా దాచాడు. వంట పూర్తయింది భోజనానికి రమ్మని పూజ పిలిచింది , పూజను కూడా తినమంటే తను ముందే తినేసానని అబద్దం చెప్పింది. భోజనం పూర్తయిన తరువాత ,ఉద్దేష్ మంచం పైన ,పూజ క్రింద నేలపైన ఒకే గదిలో పడుకున్నారు .అర్ధరాత్రి ఏదో తలుపు చప్పుడు అవ్వడంతో పోలీసులు వచ్చారేమో అని, ఉద్దేష్ ఉలిక్కిపడి లేచాడు . తను ఉన్న గదికి బయట ఎవరో గడియ పెట్టారు,గదిలో పూజ ఎక్కడా కనపడలేదు, దిండు కింద దాచిన కత్తి కూడా కనపడకుండా పోయింది……