సరిగ్గా నేర్పరితనంతో చేసుకోవాలే కాని వ్యవసాయంలో ఉన్నంత తృప్తి మరెందులోనూ లేదు. చిన్నతనం నుండి శ్రీలక్ష్మి(9573831544) గారికి భూమితో ప్రత్యక్ష సంబంధం ఉండే వ్యవసాయం అంటే ఏంతో ఇష్టం. శ్రీలక్ష్మి డబుల్ పీజీ చేశారు. మూడు సంవత్సరాల పాటు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు, మెయిన్స్ కు కూడా సెలెక్ట్ అయ్యారు కాని ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాలేకపోయారు. ఇవన్నీ ఇక అవసరం లేదు మనకు ఎంతో నచ్చిన పనినే చెయ్యాలని ఒకానొక సంధర్భంలో నిర్ణయం తీసుకున్నారు. చదువుకునే రోజుల్లో దూరదర్శన్ తెలుగులో ఒక ప్రోగ్రామ్ చూసి మష్ రూమ్ పండించాలనే కుతూహలం కలిగింది. అది ఆచరణలోకి వచ్చింది మాత్రం పెళ్లి తర్వాతనే. 2013 నుండి రాజమండ్రిలో మష్ రూమ్ పండిస్తున్నారు.


యూనివర్సిటీలో శిక్షణ:
కేవలం ఒక్క ప్రోగ్రామ్ చూసి మొదలుపెట్టడం కాదు, ఎప్పుడైతే పుట్టగొడుగులు పండించాలని అనుకున్నారో అప్పుడే రీసెర్చ్ ప్రారంభించింది. మష్ రూమ్ ను ఎంత సంఖ్యలో ఉత్పత్తి జరుగుతుంది, ఎలా ఆదాయం ఉంటుంది, ఉత్పత్తిలో మెలకువలతో పాటు ఆచార్య ఎన్.జి. రంగ విశ్వవిద్యాలయం, ఐ.ఐ.హెచ్.ఆర్(బెంగళూర్) మరియు డీ.ఎం.ఆర్ - సోలాన్(హిమాచల్ ప్రదేశ్) వంటి ప్రశంసణీయమైన యునివర్సిటీల్లో శిక్షణ తీసుకున్నారు.


నెలకు లక్ష వరకు ఆదాయం:
రాజమండ్రి కడియం జిల్లా వేమగిరి మండలంలో మొదట పుట్టగొడుగుల యూనిట్ ను ప్రారంభించారు. నెలకు 1,000 బ్యాగ్స్ లో 800 కేజీల వరకు పండించి లక్ష రూపాయాల వరకు ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయంలో శ్రీలక్ష్మి ప్రతిభను గుర్తించిన అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ వారు శ్రీలక్ష్మి మష్ రూమ్ యూనిట్ ను మదర్ యూనిట్ గా ప్రకటించి, బహుమతిని ధన రూపంలో కాకుండా 25,000 విలువైన పుట్టగొడుగుల విత్తనాలను గౌరవసూచికగా అందించింది. అలాగే హర్యాన జాతీయ స్థాయి వ్యవసాయ లీడర్ షిప్ సదస్సులో ఉత్తమ మహిళా రైతుగా ఎంపికయ్యారు.



ఈ రంగంలోకి రావాలని కోరుకునే వారికి శ్రీలక్ష్మి తన విలువైన సమయాన్ని కేటాయిస్తుంది. సీ.టి.ఆర్ కృషి విజ్ఞాన కేంద్రం మరియు ఆత్మ ఫౌండేషన్ తరుపున వచ్చే యువతకు తన ఫామ్ లొనే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ధైర్యంగా ముందుకు వచ్చే యువతకు అవసరమయ్యే పరికరాలతో పాటు మార్కెటింగ్ అవకాశాల విషయంలోనూ చేసే సహాయం ఆదర్శనీయమైనది.

మష్ రూమ్ పెంపకంలో పూర్తి వివరాలు శ్రీలక్ష్మి గారి మాటల్లో..