This Telangana Village People Sacrificed Their Lives In 70 Year Old Fight For Freedom!

Updated on
This Telangana Village People Sacrificed Their Lives In 70 Year Old Fight For Freedom!

Contributed by Aravind Arya

బైరాన్‌పల్లి నెత్తుటి గాథ.. అదో వీరపోరాటం. సరిగ్గా 69 ఏళ్ల క్రితం... బైరాన్‌పల్లిలో నరమేధం... మట్టిమనుషుల తిరుగుబాటు.. దోపిడీపై దండయాత్ర.. నిజాం మూకలపై నిప్పుల యాత్ర.. అగ్ని జ్వాలలై రగిలిన నెత్తుటి మడుగు.. గడ్డి కోసిన చేతులే కొడవళ్లు పట్టాయి. బువ్వొండిన చేతులే తుపాకీలు పట్టాయి. దొరల దాష్టీకాలకు... రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి. గడీల పాలనను ప్రజలే తరిమికొట్టారు. సామాన్యులే సాయుధులై రణనినాదం చేశారు. రైతన్నలే నిప్పుకణికలై విప్లవ శంఖం పూరించారు. వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే బైరాన్ పల్లి. నాటి తరానికే కాదు... నేటి తరానికీ స్పూర్తినిస్తోంది.

1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది. సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. భారత చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచినా... భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైంది

అది 1948 ఆగస్టు 27ఆ రోజు బైరాన్‌పల్లిలో ఉన్మాదం తాండవించింది. గ్రామ స్వరాజ్యం కోసం 92 మంది ఒకే రోజు నిజాం సేనల చేతుల్లో బలయ్యారు.

బైరాన్‌పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు. చరిత్రలోకి తొంగిచూస్తే అది బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటం.. సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం..

నిజాం సేనలను తొలుత ఊరి పొలిమేరల్లోకి తరిమికొట్టిన సాహసం వారిది. గ్రామాలపై దాడులు చేసి ఊళ్లకు ఊళ్లే తగలబెట్టి వల్లకాడుగా మార్చారు రజాకార్లు. నిజాం రజాకార్ల అకృత్యాలకు ఎంతోమంది తమ మాన ప్రాణాలను కోల్పోయారు. వీరుల్ని నిరాయుధుల్ని చేసి ప్రాణాలు తీసిన పిరికిపందల చరిత్ర ఒక వైపు ఉంటే.. మరోవైపు త్యాగాల చరిత్ర.. వ్యక్తి స్వార్థం లేని ఒక సమూహ లక్ష్యం కలిగిన మహోన్నత చరిత్ర.. వరంగల్‌ జిల్లాలోని బైరాన్‌పల్లి నేడు వీర బైరాన్‌పల్లిగా మారింది. జనగామ డివిజన్‌ మద్దూర్‌ మండలంలోని గ్రామం బైరాన్‌పల్లి... ఏనాటికీ బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరువనిది. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం. వీరోచిత పోరాట కేంద్రం.

నిజాం మూకల తూటాలకు, సైన్యం వికృత క్రీడకు బలిపశువయినా శౌర్యాన్ని చూపింది. తిరుగుబాటుకు నెలవుగా మారింది. పోరాటకాలంలో భైరాన్‌పల్లి ప్రజలు ప్రక్క గ్రామాల ప్రజలకు అండగా నిలిచారు. రజాకార్లకు ఎదురొడ్డి త్యాగాలు చేశారు. సాటి మనిషి పట్ల ఆ గ్రామం చూపిన తెగువ తెగిపోతున్న మానవ సంబంధాలకు ఆదర్శం. ఆపదొస్తే ఆదుకోవటం ఎంత బాధ్యతో లింగాపూర్‌ ఘటన అద్దంలా కనబడుతున్నది. ఆంధ్రమహాసభ పేరుతో ప్రజల్లోకి వచ్చిన ఎర్రజెండా నింపిన చైతన్యం అలాంటిది.

ఓ వైపు యావత్ భారతదేశం స్వాతంత్య్ర సంబురాల్లో మునిగితేలుతూ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుతుండగా మరో వైపు నిజాం రాజుల ఏలుబడిలో ఉన్న పల్లెలన్నీ రజాకారు మూకల ఆగడాలు, దుశ్చర్యలతో వణికిపోతున్నాయి. రజాకార్లను ఎదురించి పోరాడలేక పల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నారు. రజాకార్ల దురాగతాలను భరించలేక వారిపై తొలిసారిగా తిరుగుబాటు ప్రకటించి జంగ్‌సైరన్ చేసిన గ్రామమే వీరబైరాన్‌పల్లి. ఈ గ్రామానికి ఉన్న చారిత్రక నేపథ్యం మరే గ్రామానికి లేదనడంలో సందేహం లేదు.

బైరాన్‌పల్లి.. ఈ ఊరు పేరు వింటేనే రజాకార్లు హడలిపోతారు..

గ్రామంలో అడుగుపెట్టేందుకు నిజాం సైన్యాలు వణికిపోతాయి. పిల్లల నుంచి పడుచు యువతుల దాకా..అంతా ఒక్కటై హైదరాబాద్ సంస్థానాన్ని సవాల్ చేస్తున్న కాలమది. నిజాం చీకటిపాలన నుంచి బయటపడి భారత యూనియన్‌లో ప్రజాస్వామిక స్వేచ్ఛాగాలులు పీల్చాలని ప్రతి గుండె, ప్రతి గ్రామం తహతహలాడుతున్న సందర్భమది. వరంగల్ జిల్లా బైరాన్‌పల్లి (నాటి నల్లగొండ జిల్లా) ఈ ఆకాంక్షలకు నిలువెత్తు ఆకృతిగా నిలిచింది. ఫలితం..

గ్రామరక్షణ దళం ఏర్పాటు..

బైరాన్‌పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్యలాంటి యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకేతాటిపై నిలిచేలా చేశారు. తమ పొరుగు గ్రామమైన లింగాపూర్‌పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతున్న క్రమంలో... బైరాన్‌పల్లి గ్రామరక్షక దళం నాయకులు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్‌పల్లిని విధ్వంసం చేయాలనే నిర్ణయానికొచ్చారు

1948 మే నెలలో బైరాన్‌పల్లిపై దాడికి విఫలయత్నం:

1948 మే నెలలో 60 మంది రజాకార్లు తుపాకులతో బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150 మంది రజాకార్లు పోరుగ్రామంపై దాడికి పాల్పడి ఓటమి చెందారు. ఇలా రెండుసార్లు ఘోరంగా విఫలమైన రజాకార్లు బైరాన్‌పల్లిపై ప్రతీకారం పెంచుకున్నారు. 1948 ఆగస్టు 27న రాక్షసులు పంజా విసిరారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలను నగ్నంగా చేసి.. బతుకమ్మ ఆడించిన రజాకార్ల పైశాచిక ఆనందం నేటికీ వారి మనసుల్లో మానని గాయంగానే మిగిలిపోయింది

అవి రజాకార్లు గ్రామాలపై పడి ధన, మాన, ప్రాణాలను దోచుకుంటూ రాక్షస క్రీడలను కొనసాగిస్తున్న రోజులు. వారిని ఎదిరించి పోరాడేందుకు యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. దూళ్మిట్ట, కూటిగల్, లింగాపూర్, బైరాన్‌పల్లిలోని గ్రామ రక్షక దళాలు బైరాన్‌పల్లిని ముఖ్య కేంద్రంగా చేసుకొని రజాకార్ల ఆగడాలను తిప్పికొట్టసాగారు. దీనికి ప్రతిగా రజాకార్లు గ్రామాలపై మూకుమ్మడి దాడులు చేస్తూ ఇళ్లను తగులబెట్టి దోపిడీకి పాల్పడే వాళ్లు. గ్రామాలపై దాడులు చేసి దోచుకున్న సంపదతో తిరిగి రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద దూబూరి రాంరెడ్డి, ముకుందాడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో గ్రామ రక్షణ, గెరిల్లా దళాలు దాడిచేసి దోపిడీ సంపదను స్వాధీనం చేసుకొని పంచిపెట్టాయి.

ఈ ఘటన తర్వాత బైరాన్‌పల్లిపై రజాకార్లు ఏ క్షణానైనా దాడికి పాల్పడే అవకాశముందనే అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తైన బురుజు నిర్మించారు. బురుజుపైన మందుగుండు సామక్షిగిని నిల్వ చేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపాలా ఉండే ఇద్దరు వ్యక్తులు నగారా (బెజ్జాయి) మోగించడంతో ఆ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల, కూటిగల్, బెక్కట్, కొండాపూర్, లింగాపూర్, దూళ్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకొంటూ వచ్చేవారు. రెండుసార్లు బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించిన రజాకార్లను గ్రామరక్షక దళాలు తిప్పికొట్టడంతో 40 మంది రజాకార్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు ఏరియా కమాండర్ ఆషీం ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి రప్పించిన 500 మంది నిజాం సైనికులతో 1948 ఆగస్టు 27 తెల్లవారుఝామున బైరాన్‌పల్లిపై మూకుమ్మడి దాడి చేసి ప్రతీ ఇంట్లోకి ప్రవేశించి యువకులను బంధించి ఊరిబయటకు తీసుకువచ్చి లెంకలుగట్టి 96 మందిని కాల్చి చంపారు. మహిళలను వివస్త్రలుగాచేసి కుప్పగావేసిన మృతదేహాల చుట్టూ నగ్నంగా బతుకమ్మ ఆడించారు.

బైరాన్‌పల్లిలో ఆరోజు ఏం జరిగింది..?

1948 ఆగస్టు చివరి వారంలో అర్ధరాత్రి, ఆ ఊరికి కాళరాత్రి అయింది. నిరంకుశత్వం.. దానవరూపమెత్తి ఊరి మహిళలను చెరబట్టింది. దాదాపు వందమందిని నిలబెట్టి నిలువునా కాల్చిచంపింది

ఒకే రోజు 92 మంది గ్రామస్తులను రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. నాటి మారణకాండకు గ్రామం నడిబొడ్డులో ఉన్న బురుజు సాక్షీభూతంగా ప్రస్తుతం దర్శనమిస్తోంది. రజాకార్లను ఎదురించేందుకు బైరాన్‌పల్లి గ్రామంలోని యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. ఒక రోజు రజాకార్లు గ్రామానికి సమీపంలో ఉన్న ధూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలను రజాకార్లు దోచుకొని, దోచుకున్న సొత్తుతో బైరాన్‌పల్లి మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. దీనిని గమనించిన గ్రామరక్షక దళాలు రజాకార్లకు అడ్డు తిరిగి వారి వద్ద నుండి సొమ్మును స్వాధీనం చేసుకొని హెచ్చరికలు జారిచేస్తూ రజాకార్లను వదిలి వేసారు.

దీంతో గ్రామంపై కక్ష పెట్టుకున్న రజాకారు మూకలు గ్రామంపై ఐదు సార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడులలో 20 మందికి పైగా రజాకార్లు మృతి చెందారు. దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం బైరాన్‌పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించి, గ్రామాన్ని నేల కూలుస్తానని సవాలు చేశాడు. రజాకార్లు ఎదో ఒక రోజు గ్రామంపై దాడి చేసే అవకాశం ఉందని భావించి గ్రామస్తులు గ్రామం చుట్టూ కోట గోడ నిర్మించుకొని మధ్యలో ఎతైన బురుజును నిర్మించుకొని దానిని రక్షణ కేంద్రాంగా మలుచుకున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే బురుజుపైన ఉన్న గ్రామ రక్షక దళ సభ్యులు నగారాను మోగించేవారు.

ఏరులై పారిన రక్తం..

1947 ఆగస్ట్ 15వ తేదీన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాం రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు వీయలేదు. మద్దూరు మండలం బైరాన్ పల్లి గ్రామం సహా చాలా గ్రామాల్లో రజాకార్ల పాశవిక దాడులకు అంతులేకుండా పోయింది. అయితే. బైరాన్‌పల్లి.. గట్టిగా నిలబడింది. ఊళ్లోని బురుజును స్థావరం చేసుకొని గ్రామంలోకి వచ్చిన రజాకార్లను ప్రతిఘటించి తరిమికొట్టేది. గ్రామరక్షణ దళాలను ఏర్పాటుచేసుకొని రాత్రింబవళ్లూ కాపలా కాసేవారు. బైరాన్ పల్లి గ్రామంపై పట్టుకోసం రజాకార్లు ఐదుసార్లు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు 24 మం దికిపైగా రజాకార్లు ప్రజల చేతుల్లో మరణించారు. దీంతో బైరాన్‌పల్లిపై నిజాం మూకలు కక్ష పెంచుకున్నాయి. చివరకు దొంగదాడికి పాల్పడ్డాయి.

1948 ఆగస్టు చివరి వారంలో రజాకార్లు, పోలీసులు..నిజాం సైన్యం సాయంతో 12 వందల మంది దాడికి దిగారు. జనగామలో రాత్రి 12గంటలకు పది బస్సులలో బయలుదేరారు. లద్దునూరు మీదుగా బైరాన్‌పల్లి చేరుకున్నారు. గ్రామం చుట్టూ డేరాలు వేశారు. ఉదయం నాలుగు గంటలకు బహిర్భూమికి వెళ్లిన వడ్ల నర్సయ్యను అదుపులోకి తీసుకున్నా రు. ఆయనను వెంటబెట్టుకొని గ్రామంలోకి వస్తుండగా, వారిని నెట్టివేసి నర్సయ్య ఊళ్లోకి పరుగుపెట్టాడు. రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు. నగారా మోగించాడు. దాంతో ఊళ్లో జనమంతా గ్రామ బురుజుపైకి వెళ్లి తలదాచుకున్నారు. వారికి రక్షణగా గ్రామరక్షక దళాలు నిలిచా యి. బురుజుపై నుంచి రజాకార్లపైకి కాల్పులు జరిపాయి.

1948 ఆగస్టు 27న వేకువజామున గ్రామంలో తుపాకీ మోతలు వినిపించాయి. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం నాయకత్వంలోని రజాకారు సైన్యం గ్రామంలో తమకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 12వందల మంది బలగంతో భారీ మందు గుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున గ్రామపొలిమేర్లకు చేరుకున్నారు. గ్రామపొలిమేర్లలో కాపలాగా ఉండి రజాకార్ల కదలికలను గ్రామ రక్షక దళాలకు అందించే విశ్వనాథ్‌భట్‌జోషిని రజాకార్లు పట్టుకొని బంధించారు. తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లెంగల వెంకటనర్లయ్యను రజాకార్లు పట్టుకోగా వారి నుండి తప్పించుకొని గ్రామాన్ని చేరుకొని రజాకార్లు గ్రామంలో చొరబడ్డారు అని కేకలు వేశాడు.

గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బరుజుపైనున్న దళ కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపుగానే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు.

అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 92మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మలను ఆడించారు. ఈ దాడులలో ఈ దాడులలో 118మంది అమాయకులు బలికాగా 25మంది రజాకార్లు చనిపోయినట్లు రికార్డులలో ఉంది.

బైరాన్‌పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకార్లు దాడులు చేసి 30మందిని పొట్టన పెట్టుకున్నారు. బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగేందుకు సిద్ధం కాగా నిజాం ప్రభువు దిగివచ్చి అఖండ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది.

27 ఆగస్టు (1948) బైరాన్‌పల్లి మారణహోమం పై ప్రజాకవి కాళోజీ స్పందన..

“హింస తప్పు- రాజ్య హింస మరీతప్పు- ప్రతిహింస తప్పుకాదు” కాళోజీ ఎప్పుడూ చెప్పేవారు. గుల్బర్గా జైల్లో శిక్షననుభవిస్తున్న కాళోజీ (1948) (వీర బైరాన్ పల్లి) నరమేధం వార్తలను చదివి ఆవేదనతో రాసిన గేయం

కాటేసి తీరాలె

మనకొంపలార్చిన మన స్త్రీల చెరచిన మనపిల్లల చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరచిపోకుండగ గురుతుంచుకోవాలె కసి ఆరిపోకుండగ బుసకొట్టుచుండాలె కాలంబు రాగానె కాటేసి తీరాలె

సత్త్యమ్మహింసని సంకోచపడరాదు దయయు ధర్మంబని తడుముకోపనిలేదు శాంతియని చాటినను శాంతింపగారాదు క్షమయని వేడినను క్షమియింపగారాదు చాణిక్యనీతిని ఆచరణలో పెట్టాలె కాలంబురాగానె కాటేసి తీరాలె

తిట్టిననాల్కెల చేపట్టికోయాలె కొంగులాగినవేళ్ళ కొలిమిలోపెట్టాలె కళ్ళుగీటిన కళ్ళ కారాలు చల్లాలె తన్నిన కాళ్ళను ‘డాకలి’గ వాడాలె కండకండగకోసి కాకులకువేయాలె కాలంబురాగానే కాటేసి తీరాలె..

బైరాన్‌పల్లి పోరాటానికి గుర్తింపేది..?

రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన అమరులను, సమరయోధులను పాలకులు నిర్లక్ష్యం చేశారు. జలియన్‌వాలా బాగ్ దురాగాతాన్ని మించిన బైరాన్‌పల్లి పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందేవిధంగా పోరాట ఘట్టాన్ని పాఠ్యంశాల్లో చేర్చి, గ్రామంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

నాటి పోరాటంలో గ్రామంలోని ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంది. నాటి సమరయోధులకు ఎలాంటి పింఛన్ అందడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన బైరాన్‌పల్లి పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కాగా, బైరాన్‌పల్లిని పర్యాటక క్షేత్రంగా చేస్తామన్న హామీలు కాగితాలపైనే మిగిలిపోయాయని బర్మ రాజమల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కోటి పది లక్షల వ్యయంతో, బురుజు చుట్టూ ప్రహరీతో పాటు ఒక వాచ్‌టవర్, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, అమరవీరుల స్థూపం నుంచి బురుజు వరకు స్మృతివనం ఏర్పాటు.. ఒక కలగా మిగిలిపోయింది. అమరవీరుల విగ్రహాల ఏర్పాటును విస్మరించడం శోచనీయం.